భోగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో
మృతిచెందిన సాయికుమార్, చిన్నమ్మలు, రిత్విక
భోగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో
మృతిచెందిన సాయికుమార్, చిన్నమ్మడు, రిత్విక
పూసపాటిరేగ:
దైవదర్శనానికి వెళ్లివస్తున్న ముగ్గురిని మృత్యువు కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో రెప్పపాటులో కనిపించని లోకాలకు తీసుకుపోయింది. నిరుపేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పైళ్లె ఏడాది కాకముందే భర్త మరణించడంతో భార్య కన్నీరుమున్నీరుపెడుతోంది. ఓ వైపు భర్త, మరోవైపు తల్లి మృతదేహాలను చూస్తూ గుండెలవిసేలా రోదించింది. భోగాపురం సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుమృతి చెందడంతో శ్రీకాకుళం జిల్లా దీపావళి, ఫరీదుపేట గ్రామాల్లో విషాదం అలముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన సంచాన సాయికుమార్ (24) విశాఖపట్నంలోని బ్లిన్కిట్లో పనిచేస్తున్నాడు. అక్కడే భార్య తేజేశ్వరితో కలిసి ఉంటున్నాడు. మంగళవారం స్వగ్రామానికి వచ్చారు. బుధవారం ఉదయం భార్యతో కలిసి అత్తవారైన గార మండలంలోని దీపావళి గ్రామానికి బైక్పై వెళ్లారు. అక్కడ భార్యను ఉంచేసి అత్త లావేటి చిన్నమ్మడు (41), వదిన కుమార్తె అయిన రిత్విక(4)ను బైక్పై తీసుకుని విశాఖపట్నం సింహాచలంలోని అప్పన్నస్వామి దర్శనానికి సాయికుమార్ బయలుదేరాడు. మొక్కులు చెల్లించాక సాయంత్రం తిరుగుప్రయాణమయ్యారు. కాసేపట్లో వచ్చేస్తామంటూ భార్యకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. భోగాపురం సమీపంలో ఎన్హెచ్ –16పై నిలిపేందుకు నెమ్మదిగా వెళ్తున్న లారీను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ముగ్గ్గురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో బైక్ డివైర్పై తుల్లిపడింది. స్థానికులు అక్కడకు చేరుకునేలోపే ముగ్గురూ ప్రాణాలు విడిచారు. ఈ హృదయవిదారకర ఘటనను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. ఘటన సమాచారం అందుకున్న భోగాపురం ఎస్ఐలు వి.పాపారావు, సూర్యకుమారి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం
అత్త, వదిన కుమార్తెను తీసుకెళ్లి సింహాచలంలోని అప్పన్నస్వామి మొక్కుచెల్లించి వస్తానని చెప్పిన భర్తను మృత్యువు కాటేయడంతో భార్య తేజేశ్వరి బోరున విలపిస్తోంది. ఓ వైపు తల్లి, అక్క కూతురు, మరోవైపు భర్త మృతదేహాలను చూసి కన్నీరుపెట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. రెండు గ్రామాల్లోనూ విషాదం అలముకుంది.
మృత్యు‘మార్గం’
భోగాపురం సమీపంలోని ప్రమాద స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రాఘవులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు సందర్శించారు. ప్రమాద కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో పూసపాటిరేగ వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో నలుగురు, భోగాపురంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. రెండు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడడంతో జాతీయరహదారిపై ప్రమాదాలు నివారణకు తమవంతుగా కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.


