విజయనగరం ఫోర్ట్: భానుడు భగ్గుమంటున్నాడు. వేసవి తాపానికి జనం విలవిలాడుతున్నారు. కొందరు సొమ్మసిల్లిపోతున్నారు. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలోని వివిధ మండలాల్లో నాలుగు రోజుల్లో 11 మంది వడదెబ్బ బారిన పడ్డారు. గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదవుతోంది. ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల గంట్యాడ మండలంలోని కొత్త వెలగాడ గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. భోగాపురం మండలానికి చెందిన 60 ఏళ్ల మహిళ, కొత్తవలస మండలానికి చెందిన 15 ఏళ్ల బాలుడు, భోగాపురం మండలానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, విజయనగరం మండలానికి చెందిన 31 ఏళ్ల యువకుడు, గుర్ల మండలానికి చెందిన ముగ్గురు, ఎల్.కోట మండలానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి, గరివిడి మండలానికి 38 ఏళ్ల మహిళ, కొత్తవలస మండలానికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి, వేపాడ మండలానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్య వడదెబ్బ బారిన పడ్డారు. వీరు సకాలంలో చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. వడదెబ్బకు గురైన వారికి పీహెచ్సీల్లో చికిత్స అందిస్తున్నామని, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ జీవనరాణి అన్నారు.
41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
అవస్థలు పడుతున్న జనం
నాలుగు రోజుల్లో వడదెబ్బబారిన
11 మంది
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


