● డీపీఓలో జిల్లాస్థాయి నేర సమీక్ష సమావేశం
విజయనగరం క్రైమ్: ఇటీవల మారుతున్న నేరాలకు అనుగుణంగా దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక డీపీఓలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందితో నేర సమీక్ష సమావేశం నిర్వహించి, దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎస్., పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, రోడ్డు ప్రమాద కేసులు, సోషల్ మీడియా కేసులు, హిస్టరీ షీట్లను ఎస్పీ దామోదర్ సమీక్షించారు. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కొత్త పంథాలను ఎంచుకోవడంతో కొత్త తరహా నేరాలు నమోదవుతున్నాయన్నారు. అధికారులు వాటిని చాలెంజ్గా స్వీకరించి, ఆయా కేసుల మిస్టరీని ఛేదిచేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నందున సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, క్షేత్ర స్థాయిలో నిఘా వ్యవస్థను ఏర్పరుచుకోవాలని, గ్రామ సందర్శనలు తరచూ చేయాలని ఎస్పీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసుల (ఎం.ఎస్.పి) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దర్యాప్తు పెండింగులో ఉండేందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, లీగల్ అడ్వైజర్ వై.పరశురాం, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు, సూరినాయుడు, నరసింహమూర్తి, రమణ, ఎస్సైలు ప్రసన్నకుమార్, లీలావతి, రవి, లక్ష్మునాయుడు, సురేంద్ర నాయుడు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేర నియంత్రణ, గంజాయి రవాణానియంత్రణకు ఆకస్మిక తనిఖీలు
ఒకసారి పట్టుబడితే వదిలిస్తామని తరువాత పట్టుబడితే కేసులు ఖాయమని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. నేర నియంత్రణ, గంజాయి రవాణా నియంత్రణ కోసం విజయనగరంలో 200 చోట్ల 1200 మంది సిబ్బందితో నాకాబందీ, ఆపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా స్తానిక బాలాజీ జంక్షన్లో గజపతినగరం సీఐ రమణ, వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే.చౌదరిలు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న ఐదుగురితో అప్పటికప్పుడు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసుకుని పెట్టుకునే చర్యలు చేపట్టడాన్ని ఎస్పీ దామోదర్ అభినందించారు. ఈ సందర్బంగా బాలాజీ జంక్షన్ వద్ద రికార్డులు సక్రమంగా లేని వాహనాలను ఎస్పీ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు.


