గుమ్మలక్ష్మీపురం: వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంటరీ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్గా మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిని నియమించినట్టు పార్టీ కేంద్రకార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకంపై జిల్లాతో పాటు కురుపాంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. ఆమెకు అభినందనలు తెలిపాయి.
స్పందించిన అధికారులు
విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య విధాన్ పరిషత్ పరిధిలోని ఓ వైద్యురాలు ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడంతో పాటు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్ కూడా తీసుకుంటున్నారనే అంశంపై ‘వైద్యురాలి అత్యాశ’ అనే శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 13న ప్రచురితమైన వార్తకు వైద్య విధాన్ పరిషత్ అధికారులు స్పందించారు. వైద్యురాలు పనిచేసిన ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చీపురపల్లి ఏరియా ఆస్పత్రి డాక్టర్ కృష్ణారావు, ఏఎఫ్ఓ ఆదిత్య సింగ్లు బుధవారం విచారణ చేపట్టారు. సంబంధిత వైద్యురాలని పిలిపించి వివరాలు సేకరించారు.
అధికారులను అడ్డుకున్న రైతులు
● కార్లకు అడ్డంగా బైక్లు
గుర్ల: మండలంలోని కెల్ల, బెల్లాన పేట, మన్యపురిపేట, దమరసింగి, వల్లాపురం గ్రామాలకు చెందిన 1085 ఎకరాల్లో ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కంపెనీ ప్రతినిధులు, ఆర్డీఓ సుధారాణి, తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి బుధవారం భూముల పరిశీలను వెళ్లారు. అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న ఆయా గ్రామాలకు చెందిన రైతులు అధికారులను అడ్డుకున్నారు. అధికారుల కార్లకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు పెట్టి నిరసన తెలిపారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూములు ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. కనీసం రైతుల అభిప్రాయాలు స్వీకరించకుండా భూములు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పరిశీలిస్తున్న మన్యపురిపేట వద్దకు రైతులు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు.


