పూసపాటిరేగ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మధ్యాహ్న భోజన కార్మికులకు నష్టం కలిగించే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకుడు బి.సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న స్మార్ట్ కిచెన్ సెంటర్లను వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులంతా మంగళవారం నిరసన చేపట్టారు. అంబేడ్కర్ జయంతిలో పాల్గొని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రెండు దశాబ్దాలుగా నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించి, నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని, చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్న కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టడం తీవ్ర అన్యాయమన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు.


