విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్ను జిల్లాలోనే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ గా నిలిపేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. నగరంలోని వన్ పోలీసు స్టేషన్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం సందర్శించి, పోలీసు స్టేషన్ పరిసరాలను, స్టేషన్ లోని ప్రతి గదిని పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, యువత గంజాయి ప్రభావానికి గురికాకుండా అవగాహన కల్పించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన క్రికెట్ బెట్టింగ్, జూదం ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారు చెప్పిన సమస్యలను ఓపికగా విని తగు చర్యలు చేపట్టాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ విధిగా నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు.
నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
స్టేషన్ పరిధిలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, మరిన్ని సీసీటీవీ కెమెరాలను దాతల సహాయంతో అమర్చాలని, వాహన తనిఖీలు చేపట్టాలని, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఆకస్మికంగా లాడ్జిలు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి ద్విచక్ర వాహన దారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, ప్రజలకు రహదారి భద్రతా ప్రమాణాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు, వాట్సాప్ ద్వారా అరెస్ట్ (డిజిటల్ అరెస్ట్) పట్ల ప్రజలకు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సి.సి.టి.ఎన్.ఎస్.లో ఎప్పటి కప్పుడు కేసుల వివరాలను అప్డేట్ చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఈ సాక్ష్యలో అప్లోడ్ చేయాలి
హిట్ అండ్ రన్, మిస్సింగు కేసుల్లో ఆధారాలు సేకరించేందుకు సిసిటివి 360 యాప్ ను అధికారులు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కేసుల దర్యాప్తులో చేపట్టిన చర్యలను ఈసాక్ష్య యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రమాదాలకు ఎవ్వరూ అతీతులు కారని, పోలీసు సిబ్బంది కూడా ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.అనంతరం, పోలీసు స్టేషన్లో పనిచేసే పోలీసు సిబ్బందితో ఎస్పీ మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీసీఎస్ సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్సై రవి, సురేంద్ర నాయుడు,కమల్ భార్గవ్, లక్ష్మునాయుడు, లక్ష్మీ ప్రసన్న కుమార్, స్టేషన్ సిబ్బంది ఇమ్రాన్,శివ,గౌరీశంకర్, శ్రీను,రమణ,అంజి,సూర్య,అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఎస్పీ ఆదేశాలు


