రాజాం సిటీ: మండల పరిధి కంచరాం–కొత్తకంచరాం గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన వేసిన చోడిచేను చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో పొగ మొత్తం రోడ్డుపైకి చేరింది. ఈ సందర్భంగా రోడ్డుపై అటూ ఇటూ వచ్చేవారు కనిపించకుండా పోయేంతగా పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఇసుక ట్రాక్టర్ బోల్తా..
ఇదిలా ఉండగా అదే దారిలో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరిమితికి మించి ఇసుకను తరలించడంతోపాటు టార్పాలిన్లు కూడా కప్పకుండా వెళ్తుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించి ఇసుకను తరలిస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


