డెంకాడ:
రామతీర్థం రాములోరితో కూటమి నేతలు రాజకీయాలు చేస్తుండడం విచారకరమని, అసత్యాలు పలకడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. డెంకాడ పంచాయతీ పరిధి దొడ్డిబాడువ గ్రామంలో ఆయన మంగళవారం మాట్లాడారు. రామతీర్థం ఆలయ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో భక్తులకు తెలుసన్నారు. ఆలయాలు కూల్చివేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాల హయాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి సాయంతో రాములవారి ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. రామతీర్థం కొండపైకి మార్గంతోపాటు కొండపైన శిఖర దీపాన్ని వెలిగించామన్నారు. కొందరు దుండగులు రామతీర్థంలోని కోదండరామాలయంలోని రాముడు శిరస్సు ఖండించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వెంటనే పరిస్థితిని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి వివరిస్తే ఆయన వెంటనే సుమారు నాలుగున్న కోట్ల రూపాయలు మంజూరు చేయించడంతో కొండపై నూతన ఆలయాన్ని 11 నెలల్లో నిర్మించామని, నూతన విగ్రహాలను కూడా శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారన్నారు. విగ్రహం ధ్వంసంపై కేసు ఉండడంతో శిరస్సు ఖండన విగ్రహాలను ముందుగా నెల్లిమర్ల పోలీస్టేషన్లోను, తర్వాత రామతీర్థంలో ఉంచారన్నారు. అప్పట్లో సూరిబాబు అనే వ్యక్తిపై పోలీసులు కేసుకూడా నమోదు చేశారని వివరించారు. అప్పుడు హడావుడి చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాముడు శిరస్సు ఖండించిన వ్యక్తి ఎవరన్నది తేల్చకుండా ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడు మూర్తులను కోటిపల్లి రేవులో జలాధివాసం చేయడం వారి చిత్తశుద్ధిని తేటతెల్లంచేస్తోందన్నారు. రామతీర్ధం నుంచి రణస్థలం రోడ్డు విస్తరణ పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సాగాయన్నారు. మిగులు పనులు పూర్తిచేసి రోడ్డు వేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కూటమి ప్రభుత్వం, నేతల తీరుపై
మండిపడిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు
టీడీపీ హయాంలో ఆలయాలకు
రక్షణ కరువు
ఆలయాల కూల్చివేసిన చరిత్ర
చంద్రబాబుదే..
రాముడు శిరస్సు ఖండించిన వారు తేలకుండా జలాధివాసమా..?
కూటమి నేతలు, ప్రజాప్రతినిధులువి దిగజారుడు రాజకీయాలు
మండిపడిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు


