● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె. హేమలతతో కలిసి 70 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 14 వినతులు రాగా.. మిగిలినవి వివిధ శాఖలకు సంబంధించినవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి, వాటికి పరిష్కార మార్గం చూపాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన వినతుల్లో కొన్ని ..
● పార్వతీపురం పట్టణం బెలగాంలో తమ అనుభవంలో ఉన్న ఖాళీ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో ఎం. కృష్ణమూర్తి ఆక్రమించుకుని, నిర్మాణం చేస్తున్నాడని చింత తవిటినాయుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
● మహిళా సంఘాల రుణం కోసం రెండేళ్ల నుంచి వెలుగు కార్యాలయాల చుట్టూ సిబ్బంది తిప్పించుకుంటున్నారని పార్వతీపురం మండలం కొత్తచందలింగి గ్రామానికి చెందిన దుర్గాదేవి గ్రూపు సభ్యులు కొర్రా సూరమ్మ, తామల సుమిత్ర తదితరులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రుణం మంజూరు చేయాలని కోరారు.
● పదిహేనేళ్ల నుంచి భర్తతో విడిగా ఉంటున్నానని.. తనకు తెలియకుండా తనకు వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి ఖాళీస్థలాన్ని తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారని, అతనిపై చర్యలు తీసుకుని తన ఆస్తిని తనకు అప్పగించాలని కోరుతూ పాలకొండ పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన పప్పల పద్మావతి వినతిపత్రం అందజేశారు.


