● 223 వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జేసీ ఎస్.సేతుమాధవన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు పోటెత్తారు. మొత్తం 223 వినతులు రాగా.. అందులో రెవెన్యూ శాఖకు చెందినవి 95 కాగా మున్సిపల్ 12, ఏపీఈపీడీసీఎల్ 7, డీపీఓ 15, డీఎంహెచ్ఓ 2, గ్రామ సచివాలయ శాఖ 4, విద్యాశాఖ 3, డీఆర్డీఏ 22, ఇతర శాఖలకు చెందినవి 61 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పిటీషనర్లతో అధికారులు నేరుగా మాట్లాడాలని, పదే పదే వచ్చే ఫిర్యాదులను సునిశితంగా పరిశీలించాలని సూచించారు. గడువుదాటక ముందే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 1100 టోల్ఫ్రీ నంబర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ నంబర్కు వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని తెలిపారు. డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.


