● వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి పొదల్లో
పడేసిన దుండగులు
● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లి మధుర గ్రామమైన గొల్లలపేటలో దారుణం చోటు చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్సై ఎల్.గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పీతల సత్యం శనివారం ఉదయం 11 గంటల సమయంలో గొర్రెల మందను చూసేందుకు గ్రామ సమీపంలోని చింతల చెరువు వద్దకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వెళ్లిపోతానని చెప్పిన సత్యం ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెతకగా.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని పొదల్లో కాళ్లు, చేతులు కట్టేసి పడిఉన్నాడు. ఎవరో తనపై దాడి చేసి కాళ్లు, చేతులు కట్టేసి పడేశారని చెప్పి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి సత్యంను బొండపల్లి పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.


