విజయనగరం రూరల్: జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న శేషగిరి విజ్ఞాన కేంద్ర భవనానికి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రూ.2 లక్షలు విరాళం ప్రకటించారు. శనివారం ఆయన కార్యాలయంలో కలిసిన యూటీఎఫ్ నాయకులు భవన నిర్మాణ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా, భవన నిర్మాణం మొదటి అంతస్తు టైల్స్ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందిస్తానని వారికి హామీనిచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా శాఖ సీనియర్ నాయకులు కె.విజయగౌరి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఏబీఆర్ ఈశ్వరరావు, తదితరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: పార్వతీపురం మండలం కారాడవలస గ్రామానికి చెందిన అడారి వంశీ శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి పడిపోవడంతో మృతి చెందాడు. సీఐ నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని డొంగురువలస గ్రామంలో ఓ వివాహానికి హాజరై శుక్రవారం రాత్రి ట్రాక్టర్పై తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు వంశీ రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానిక సీహెచ్సీలో చేర్పించి వైద్యం అందించే క్రమంలోనే వంశీ మృతి చెందినట్టు మృతుడు తల్లి అడారి కళావతి ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. శనివారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.
ఎస్పీ బంగ్లా సమీపంలో గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్ : ఎస్పీ బంగ్లా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు కంట్రోల్ రూమ్కు వచ్చిన సమాచారంతో వన్టౌన్ పోలీసులు నగరంలోని మయూరి జంక్షన్ వద్ద ఎస్పీ బంగ్లాకు చేరువలో నాగోజీపేట రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. చామనఛాయ రంగుతో బ్లాక్ జీన్ ఫ్యాంట్ ధరించి షర్ట్ లేకుండా ఉన్న మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ఏఎస్ఐ జగన్మోహనరావు కోరారు.


