విజయనగరం అర్బన్: జిల్లాలో అమలవుతున్న జలధార – జలహారతి వంద రోజుల కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్టికేషన్స్ సెంటర్ (ఏపీఎస్ఏసీ) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజుతో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం తన చాంబర్లో సమీక్షించారు. తొలిత ఆయన్ని కలెక్టర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ట్యాంకుల ప్రస్తుత స్థితి, కొత్తగా నిర్మించాల్సిన చెక్డ్యామ్లు, నీటి వనరుల అభివృద్ధి చర్యలపై ఏపీఎస్ఏసీ అందిస్తున్న సాంకేతిక సహకారం గురించి మరియరాజు వివరించారు. ఉపగ్రహ చిత్రాలు, జీఐఎస్ ఆధారిత మ్యాప్స్ ద్వారా గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన పనులను ఖచ్చితంగా గుర్తించి సంబంధిత శాఖలకు అందజేస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో శాస్త్రవేత్తలు పర్యటిస్తూ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డ్వామా శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు, భూగర్భ జలాల పెరుగుదలకు ఈ కార్యక్రమం ఎంతో కీలకమని అన్నారు. ఏపీఎస్ఏసీ అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని సమర్ధవంతంగా వినియోగించి శాఖల సమన్వయంతో లక్ష్యాలను సమాయానికి సాధించాలని అధికారులను ఆదేశించారు.


