● న్యాయం కోసం రోడ్డెక్కిన ఆర్పీలు
● ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దంటూ మెప్మాకార్యాలయం వద్ద ఆందోళన
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణం జొన్నగుడ్డిలో పనిచేస్తున్న ఆర్పీ జయలక్ష్మి పనిఒత్తిడి వల్లే గుండెపోటుతో మృతి చెందిందని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ ఆర్పీల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశా రు. మృతురాలి ఫొటోలను పట్టుకుని న్యాయం చేయాలంటూ నినదించారు. అనంతరం పని ఒత్తిడి తగ్గించాలంటూ మెప్మా పీడీ చిట్టిరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పీల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ ఝూన్సీ, సీఐటీయూ నాయకులు పి.మణి, జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి మాట్లాడుతూ... జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఆర్పీలపై అధిక పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త యాప్లను తీసుకువచ్చి రెండు రోజుల్లో లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తేవడం వల్లే జయలక్ష్మి గుండెపోటుకు గురైందని ఆరోపించారు. సరైన శిక్షణ లేకుండా ఇంజినీర్లు చేయాల్సిన పనులను ఆర్పీలకు అప్పగించడం అన్యాయమన్నారు. జయలక్ష్మి మృతి సహజం కాదని, ప్రభుత్వ విధానాల వల్లే జరిగిందని ఆరోపించారు. మరో ఆర్పీ రూప కూడా పని ఒత్తిడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఆర్పీలపై పెరుగుతున్న ఒత్తిడిని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని కోరారు.
● జీతాలు చెల్లించకుండా బతికేదెలా?
నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని ఆర్పీల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలతో జీతాలు అందకపోతే జీవనం ఎలా సాగించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలు జయలక్ష్మి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, ఆర్పీలపై యాప్ల భారం తగ్గించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, ఎస్హెచ్జీ మీటింగ్ లొకేషన్ యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఎం.లత, కార్యదర్మి జి.రేణుక, ఉపాధ్యక్షురాలు బి.అప్పలనరసమ్మ, స్వాతి, డి.రమ, తదితరులు పాల్గొన్నారు.


