● జెడ్పీ సీఈఓకు పీఆర్టీయూ జిల్లా కమిటీ ఫిర్యాదు
విజయనగరం అర్బన్: జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా రాజాం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలు ప్రారంభించకపోవడం తగదని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ ఖాతాలు జిల్లాలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ బీఏ సత్యనారాయణకు శనివారం విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ వసూళ్లలో లక్ష్యాలు సాధించాలి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో రెవెన్యూ వసూళ్లలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ వసూళ్ల పురోగతిపై సమీక్షించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, గనులు, భూగర్భ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అటవీ శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన వసూళ్లు, పురోగతి శాతం, లోటుపాట్లపై చర్చించారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలు, సంస్థలు స్థానికంగానే రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తవలస, తెర్లాం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిన విషయంపై విచారణ జరపాలన్నారు.
శ్రీశ్రీ మేనకోడలి ‘మాటామంతి’
విజయనగరం టౌన్: మహాకవి శ్రీశ్రీ మేనకోడలు, ప్లేబ్యాక్ సింగర్, కవయిత్రి ఉపద్రష్ట లక్ష్మి మాటామంతి కార్యక్రమాన్ని మహాకవి గురజాడ స్వగృహంలో శనివారం నిర్వహించారు. యువస్పందన, నరసం శాఖల ప్రతినిధులతో సాహిత్యపరమైన విషయాలను చర్చించారు. అనంతరం జిల్లాకు చెందిన మానాప్రగడ సాహితి, దాసరి పద్మ, గురజాడ మునిమనవరాలు గురజాడ ఇందిర, చిన్నాదేవి, చీకటి చంద్రిక తదితరులు ఆమెను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
సచివాలయంలో సర్కారుబడి
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం ప్రాథమిక పాఠశాలను ఆ గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. పాఠశాలను రెండేళ్ల కిందటి వరకు స్థానికంగా ఉన్న మిషనరీ సంస్థ నడిపేది. పాఠశాల నిర్వహణ భారం కావడంతో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే 36 మంది విద్యార్థులతో ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం ఇక్కడి చిన్నారులకు చదువుచెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అయితే, పాఠశాలకు వసతి లేకపోవడంతో సచివాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో ఐదు తరగతుల బోధ నకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సచివాలయానికి వివిధ పనులపై వచ్చేవారివల్ల బోధనకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల భవనాలు నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.


