విజయనగరం క్రైమ్/ఎల్.కోట: అరకు–విశాఖపట్నం జాతీయరహదారిపై కారులో శుక్రవారం తరలిస్తున్న 55 కిలోల గంజాయిని ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామ కూడలిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ శనివారం మీడియాకు తెలిపారు. ఒడిశా నుంచి విశాఖపట్నానికి కారులో గంజాయిని తరలిస్తున్నట్టు ఎల్.కోట పోలీసులకు అందిన పక్కా సమాచారంతో రంగరాయపురం కూడలిలో తనిఖీలు చేపట్టారు. కారును నిలిపి అందులోని 22 ప్యాకెట్లలో ఉన్న 55 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, అరుకు మండలం, బోసుబెడ్డకి చెందిన సోనై రాజబాబు, కారుకు పైలట్గా స్కూటీపై వెళ్తున్న ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పాడువ మండలం, హట్టగూడకి చెందిన నంజయ్ హంతల్, ఒడిశా రాష్ట్రం, పూరి జిల్లా, తలజంగాలోని మధుబనబాలియకి చెందిన సంజీబ్ కుమార్ మహంతి (40) ఉన్నారు. వారి నుంచి గంజాయితో పాటు కారు, మూడు సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన పింకూ, దాదా అనే మరో ఇద్దరు పరారిలో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్.కోట రూరల్ సర్కిల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎల్.కోట ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
పరారీలో మరో ఇద్దరు నిందితులు
ఒడిశా నుంచి విశాఖకు గంజాయి
తరలింపు
వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్


