విజయనగరం ఫోర్ట్: ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు. వైద్యులతో పనిచేయించుకున్న చంద్రబాబు సర్కారు వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు మాత్రం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. వైద్యులతో పనిచేయించుకుని ఏడాదికి పైగా అవుతున్నా వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేయడంపై వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట టీడీపీ సర్కారు సదరం రీ వెరిఫికేసన్ పేరిట సదరం క్యాంపులు నిర్వహించింది. అయితే ఈ క్యాంపులకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులను కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర ఆస్పత్రులనుంచి వైద్యులను రప్పించి సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ చేయించారు. ఇందుకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాజాం, పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి ఆస్పత్రులకు చెందిన వైద్యులు హాజరయ్యారు.
వివిధ ఆస్పత్రుల్లో సదరం క్యాంపులు..
జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, చీపురపల్లి, ఎస్. కోట, రాజాం, సాలురు ఏరియా ఆస్పత్రులతో పాటు పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో క్యాంపులు నిర్వహించి వైద్యులు రీ వెరిఫికేషన్ చేయించారు.
2025 జనవరిలో ప్రారంభం..
2025 జనవరి నెలలో సదరం రీ అసెస్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారరాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినప్పటికీ.. ఇంతవరకు వారికి ఇవ్వాల్సిన టీఏ,డీఏలు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
30 వేల మందికి పైగా..
జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ చేశారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్మెంట్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఎముకులు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి సుమారు 30 వేల మందికి పైగా దివ్యాంగులకు వైద్యులు పరీక్షించారు. ఈ క్యాంపుల్లో పాల్గొన్న వైద్యులకు సుమారు రూ. 1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సదరం క్యాంప్లకు వెళ్లిన వైద్యులకు అందని టీఏ, డీఏలు
16 నెలలైనా పట్టించుకోని
ఉన్నతాధికారులు
వైద్యులకు చెల్లించాల్సిన బకాయిలు
రూ. 1.50 కోట్లు
బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు
అధికారులకు తెలియజేశాం..
దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నిధులు త్వరలోనే వైద్యుల ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ పద్మశ్రీ రాణి,
జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి


