విజయనగరం ఫోర్ట్: వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల నియామక విషయంలో టీటీపీ ప్రభుత్వం వ్యవహారించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం.. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉద్యోగాలకు ఎంపికై న వారికే ఎసరు పెట్టేవిధంగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
2024 డిసెంబర్లో నోటిఫికేషన్..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2024 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 17 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 17 జనరల్ డ్యూటీ అటెండెంట్ (జీడీఏ), స్టోర్ అటెండర్ పోస్టులు –2, ఒక ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు కూడా 2024 డిసెంబర్లో జాయింట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే కొద్ది రోజుల కిందట ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. కాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినా ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో ఆయా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భర్తీ పక్రియలో తీవ్ర జాప్యం..
సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన 16 నెలల వరకు భర్తీ పక్రియ చేపట్టలేదు. ఎట్టకేలకు భర్తీ పక్రియ చేపట్టారంటే నియామక ఉత్తర్వులు (అపాయింట్మెంట్ ఆర్డర్స్) ఇవ్వకుండా జాప్యం చేయడం పట్ల ఎంపికై న అభ్యర్థులు మండిపడుతున్నారు.
నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు..
సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి సంబంధించి 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తారనే గుసగుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే ఎంపికై న అభ్యర్థులకు అన్యాయం జరగనుంది.
ఏజెన్సీకి కట్టబెట్టేందుకే..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులను ఔట్పోర్సింగ్ పద్ధతిలో కాకుండా ఏజెన్సీకి కట్టబెట్టేందకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పోస్టుల భర్తీ పక్రియను అప్పజెప్పేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఏజెన్సీల ద్వారా పోస్టులు భర్తీ చేపడితే పోస్టుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ బాధ్యత ఏజెన్సీలకు కట్టబెట్టే యత్నం
నియామక పక్రియ పూర్తయినా
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని వైనం
నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు
ఆందోళనలో ఎంపికై న అభ్యర్థులు
వైద్య కళాశాల పోస్టులకు ఎంపికై న వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేత
ఆర్డర్స్ ఇవ్వొద్దనే ఆదేశాలు
వచ్చాయి..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులకు ఎంపికై న వారికి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ ఆర్డర్స్ వచ్చేవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని ఆప్కోస్ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆర్డర్లు ఇవ్వలేదు.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


