● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలోని పాత్రికేయులంతా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టుల కోసం ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఎ.డి పి.గోవిందరాజులు, తిరుమల మెడికవర్ ఎం.డి డాక్టర్ తిరుమల ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.జీవనరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ సాయిరాం, తిరుమల మెడికల్ సెంటర్ హెడ్ పవన్కుమార్, ఐఈయూ ఇన్చార్జ్ డాక్టర్ ఎ.జగదీష్, కార్డియాలజిస్ట్ శ్రీకిరణ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పీఎస్ఎస్వీ ప్రసాదరావు, బూరాడ శ్రీనివాసరావు, డివిజన్ పీఆర్ఓ ఎస్.జానకమ్మ, పీఆర్ఓ మజ్జి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.


