● వీటీ అగ్రహారం, దాసన్నపేట మధ్య
ఇంటర్ లింకింగ్ లైన్ అనుసంధానం పూర్తి
సాక్షి, ప్రతినిధి, విజయనగరం:
విజయనగర వాసులకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు లో–వోల్టేజ్ సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. వీటీ అగ్రహారం 132/33 కేవీ సబ్స్టేషన్ నుంచి దాసన్నపేట వరకు నిర్మించిన 5 కిలోమీటర్ల సరికొత్త 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.లక్ష్మణరావు, ట్రాన్స్కో ఎస్ఈ వరప్రసాద్, తదితరులు ఈ నూతన లైన్న్ను ప్రారంభించారు. టౌన్ డివిజన్ పరిధిలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఇంటర్ లింకింగ్ లైన్వల్ల విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఏర్పడినా వినియోగదారుల ఇళ్లలోని ఉపకరణాలకు ఎటువంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. తుఫాన్ల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు నిమిషాల వ్యవధిలోనే ప్రత్యామ్నాయ మార్గంలో సరఫరాను పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఈ లైన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.


