గజపతినగరం: విజయనగరం జిల్లా మెంటాడ మండలం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు (ఏఈఈ) పల్లి గౌతమ్ నాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ (వర్క్ ఇన్స్పెక్టర్–అవుట్సోర్సింగ్) పెది రెడ్ల సంతోష్ లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మెంటాడ పంచాయతీలో రూ.5.20 లక్షల విలువైన సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనం పనులను పంచాయతీ జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తిచేశారు. పనుల బిల్లుల కోసం మెంటాడ గ్రామ సర్పంచ్ రాంబాబు పంచాయతీరాజ్ అధికారులను సంప్రదించారు. బిల్లులు చెల్లించాలంటూ పలుసార్లు విన్నవించారు. దీనికోసం ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ కలిసి రూ.లక్షా30వేలు డిమాండ్ చేశారు. ఆయన రూ.లక్షా20వేలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య వలపన్నారు. పథకం ప్రకారం గజపతినగరం ఉపఖజానా కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో రూ.లక్షా 20వేలును సర్పంచ్ నుంచి ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్లు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య, సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్సై కె.వాసునారాయణరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేశారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
రూ.5.20లక్షల విలువైన పనులకు..
రూ.1.30 లక్షల లంచం డిమాండ్
లంచం తీసుకుంటూ పట్టుబడిన
పంచాయతీరాజ్ ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్


