వేపాడ: సొంతూరు రుణం తీర్చుకోవాలన్న వారి కల రామాలయ నిర్మాణానికి స్థలం వితరణగా అందజేయడం ద్వారా తీర్చుకున్నారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. వేపాడ మండలం సోంపురం గ్రామ సర్పంచ్ మురిపిండి గంగరాజు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దివంగత తల్లావఝుల రామజోగినరసింహం, పార్వతీ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారులు వరహానరసింహామూర్తి, రాధాకృష్ణ, పురుషోత్తం, విజయగోపాలం, కుమార్తె లక్ష్మి జన ఐదుగురు తమకు వారసత్వంగా దఖలు పడిన 16 సెంట్లు(రూ.50లక్షల విలువైన) స్థలాన్ని గ్రామంలో రామాలయ ప్రాంగణానికి వినియోగించేలా వితరణగా అందజేశారు. వీరంతా కొల్కత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో స్థిరపడడంతో జన్మనిచ్చిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఆశయంతో స్థలాన్ని వితరణంగా అందజేశారని సర్పంచ్ గంగరాజు, ఎంపీటీసీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వితరణ స్థలంలో శిలాఫలకం ఏర్పాటు చేసి శుక్రవారం ఆవిష్కరించారు.


