విజయనగరం అర్బన్: సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక అమర్ భవన్లో శుక్రవారం ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తక్షణమే ఆరోగ్య భద్రత కల్పించాలని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సమావేశం ద్వారా డిమాండ్ చేశారు. అదే విధంగా సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తూ మిగిలిన ఉపాధ్యాయులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సీనియారిటీని గుర్తిస్తూ అగ్నివేర్ పథకం మాదిరిగా రిటైర్మెంట్ ప్రయోజనాలను సింగిల్ సెటిల్మెంట్ రూపంలో అందించాలని పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పిస్తూ 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని సమావేశం కోరింది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, రాష్ట్ర కౌన్సిలర్ వి.గోవిందరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్దొర, ఎంటీఎస్ నాయకులు టి.రామారావు, గోపీనాధ్, శ్రీనివాసరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


