కొత్తవలస మండలంలోని అర్థన్నపాలెం పరిస్థితి 1984కు ముందు అధ్వానం. చెడు వ్యసనాలకు బానిసలైన వారే అధికంగా కనిపించేవారు. ఆ సమయంలో అక్కడి ప్రాథమిక పాఠశాలకు వంగర మండలం నీలయ్యవలస గ్రామానికి చెందిన జగన్మోహన్రావు బదిలీపై వచ్చారు. గ్రామ పిల్లలతో పాటు పెద్దల్లోనూ మార్పు అవసరమని గుర్తించారు. ఓ వైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే మరోవైపు పెద్దలకు కళారంగంలో ప్రోత్సహించారు. భజనలు, భక్తి గీతాలాపనలు, కోలాట ప్రదర్శనలు, లఘనాటిక ప్రదర్శనల్లో తర్ఫీదు ఇచ్చారు. సామాజిక చైతన్యం నింపారు. లఘు నాటికలతో చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతే... గ్రామస్తుల్లో మార్పుమొదలైంది. ఓ వైపు యువత ఉద్యోగబాట పట్టగా... పెద్దలందరూ కళారంగంలో తరిస్తున్నారు. పిల్లలను చక్కగా చదివిస్తున్నారు. ఐక్యంగా ఊరిని బాగుచేసుకుంటున్నారు. వీటన్నింటికీ జగన్మోహన్రావు మాస్టారే కారణమని భావించి తమ భజనమండలికి, పాఠశాల భవనానికి, కోలాట బృందానికి ఆయన పేరు పెట్టారు. శ్రీరామనవమి పర్వదినాన.. జగన్మోహన్రావు, ఇందిర దంపతులను శుక్రవారం ఊరేగింపుగా తీసుకొచ్చి ఘన సన్మానం చేశారు. జ్ఞాపికలు అందజే శారు. మా ఊరి మా మంచి మా‘స్టార్’ అంటూ కొనియాడారు. ఆయన విశ్రాంతి పొందినా.. మా ఊరి బాగుకు ఆయనే ప్రధాన గురువుగా పేర్కొన్నారు. ఈ రోజు అందరం సంతోషంగా ఉన్నామంటే ఆయన విత్తిన విద్యా, సామాజిక చైతన్య విత్తనాలే కారణ మని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. – కొత్తవలస


