విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–జీవీలో క్రీడా వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి వీవీ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి పట్ల సంస్థ కళాశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా విజయాలు వారి భాగస్వామ్యం కార్యక్రమంలో ప్రతిబింబించాయన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, టీసీఎస్ సంస్థ ప్రతినిధి జె.వి.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల లక్ష్యసాధన ప్రాముఖ్యతను వివరించారు. రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ విద్యతో పాటు విలువల సాధనకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్య, క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. అనంతరం కళాశాల మ్యాగజైన్ను వీసీ సుబ్బారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అతిథుల సన్మానం, ప్రతిభావంతులైన విద్యార్థులకు అకడమిక్ అవార్డులు, బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోట చంద్రభూషణరావు, ఏవీ పాపారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


