● వెదురు వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు
● తొలివిడతగా వాటర్ బాటిల్స్ తయారీ
● జీఎంఆర్వీఎఫ్ ఆవరణలో యూనిట్
రాజాం: రాజాంలో గ్రీన్ మీ అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రీన్ మీ (గ్రీన్ మీ ఎకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థ వినూత్న వెదురు ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుట్టింది. తన ఉత్పత్తి కార్యాలయాన్ని రాజాంలో ఏర్పాటుచేసింది. గతంలో జీఎంఆర్ నైరెడ్ సమీపంలో జీఎంఆర్ఐటీ నిర్వహించిన వెదురు ప్రాసెసింగ్ యూనిట్ను గ్రీన్ మీ సంస్థ తీసుకుంది. జీఎంఆర్వీఎఫ్ సాయంతో ఈ యూనిట్లో వెదురు వస్తుసామాగ్రి తయారీ ప్రారంభించింది. తొలుతగా వెదురు కలపతో స్టీల్, రాగి, గాజుతో కూడిన వాటర్ బాటిల్స్ను తయారుచేస్తోంది. పదిమంది మహిళా కార్మికులతో యూనిట్ను ప్రారంభించారు. 500 వాటర్ బాటిల్స్ను తయారుచేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. మార్కెట్లో వీటి వినియోగం ఆధారంగా ప్రతిరోజు 1000 బాటిల్స్ తయారీని లక్ష్యంగా చేసుకుంటున్నామని, అంతర్జాతీయ సంస్థలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు వీటిని విక్రయించే ఒప్పందాలు జరుగుతున్నాయని గ్రీన్మీ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ రూ.1 కోటి విలువైన అత్యాధునిక యంత్రాలు ఏర్పాటుచేసి, జీరో వేస్ట్ పాలసీని పాటిస్తూ వాటర్ బాటిళ్లు తయారు చేస్తున్నారు. గ్రీన్ మీ కార్యకలాపాలకు భారత ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గ్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అధికారిక స్టార్ట్ప్ గుర్తింపును ఇచ్చింది.
భవిష్యత్తులో మరిన్ని..
భవిష్యత్తులో పర్యావరణ హితమైన టూత్ బ్రష్లు, టూత్ పిక్లు, దువ్వెనలు, కిచెన్కు సంబంధించి స్పూన్సు, ఫోర్క్లు, కత్తులు, స్ట్రాలు, కార్యాలయాలకు సంబంధించి వెదురు ఆఫీస్ స్టేషనరీ, అలంకరణ వస్తులు తయారీ ప్రారంభిస్తామని, వెదురును పారిశ్రామిక అవసరాల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సంస్థ ఫౌండర్ వడ్డే పవన్కుమార్ తెలిపారు.


