విజయనగరం టౌన్: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మహిళల సదస్సును ఈ నెల 29న ఆదివారం క్షత్రియ కల్యాణ మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు చివుకుల శ్రీలక్ష్మి, భోగరాజు సూర్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. విశిష్ట అతిథులుగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్డి.విల్సన్, శరత్ చంద్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్షతన నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ సాహతీవేత్తలు రచించిన పుస్తకావిష్కరణలు, నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు, జిల్లా ప్రముఖులకు సత్కారాలు ఉంటాయన్నారు. సాహితీవేత్తలందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కె.అనూరాధ, సహాయ కార్యదర్శి దాసరి పద్మ, గురజాడ ఇందిర తదితరులు పాల్గొన్నారు.


