పార్వతీపురం రూరల్ : ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళనలో జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు పాల్గొని మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్న్ హామీని అమలు చేయాలని, పెన్షన్ల తొలగింపు ప్రక్రియను ఆపాలని కోరారు. దళిత, గిరిజన వాడల్లో శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా నాయకులు ఆర్వీఎస్ కుమార్, ఈవీ నాయుడు, గోపి నాయుడు, పువ్వల ప్రసాద్, ఎం.గోపాల్, సింహాద్రి దుర్గారావు, రవికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా


