● జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో విజయనగరాన్ని క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్ గ్రా మాలు, జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాధిసోకే ప్రమాదం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఒక హైరిస్క్ గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కవర్చేస్తామన్నారు. హ్యాండ్ హెల్త్ ఎక్సరే పరికరంతో క్షేత్ర స్థాయిలోనే త్వరితగతిన పరీక్షలు నిర్వహించే వీలుంటుందని తెలిపారు. పరీక్షలు చేయించుకున్న ప్రతి వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె. రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, డీఐఓ రెడ్డి అచ్చుతకుమారి, ఎన్సీడీ పీఓ సుబ్రమణ్యం, ఐసీడీఎస్ పీడీ బాలామణి, తదితరులు పాల్గొన్నారు.


