అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
లక్కవరపుకోట : మండలంలోని లక్కవరపుకోట – ఖాసాపేట గ్రామాల మధ్య ఉన్న గెడ్డపై గల బ్రిడ్జి కింద వేపాడ మండలం గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ కిశోర్(19) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు తన స్నేహితుడు మహేష్తో కలిసి తన తాతగారి గ్రామమైన లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఖాసాపేట బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనంతో పాటూ బ్రిడ్జి కింద గల గెడ్డలో పడిపోయాడు. దీంతో ద్విచక్ర వాహనంతో పాటు మృతుడు కిశోర్ గెడ్డలో మునిగిపోయారు. అక్కడ నుంచి స్వల్ప గాయాలతో స్నేహితుడు మహేష్ కొట్యాడ గ్రామానికి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. కాగా తనకు తగిలిన దెబ్బలు, జరిగిన ప్రమాదం గురించిగాని మహేష్ బంధువులకు చెప్పలేదు. గురువారం మధ్యాహ్నం గెడ్డ సమీపంలో పశువులు కాపర్లు నీటిలో ద్విచక్ర వాహనాన్ని గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాలించి ద్విచక్ర వాహనాన్ని, నీటిలో మునిగిపోయిన కిశోర్ను వెలుపలకు తీశారు. మృతుడి జేబులో గల సెల్ఫోన్ ఆధారంగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి స్నేహితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నవీన్పడాల్ తెలిపారు.
భార్య మందలించిందని..
విజయనగరం క్రైమ్: కట్టుకున్న భార్య మందలించిందన్న కారణంతో భర్త పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డాడు. ఇందుకు సంబంధించి విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ గురువారం తెలిపిన వివరాలు.. కోరుకొండ పాలెంకు చెందిన సిరిపురపు వెంకటసత్యం(40) రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చేవాడు. రోజూలాగే గురువారం మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త సత్యాన్ని తాగుడు మానమని భార్య కాస్త మందలించింది. దీంతో కట్టుకున్న భార్యే తనను మందలించిందన్న కోపంతో మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి


