పరీక్ష కేంద్రాల్లో డీఆర్ఓ తనిఖీ
పార్వతీపురం రూరల్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె.హేమలత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఆర్.కె.జూనియర్ కళాశాల, పి.ఎస్.ఎం.వాసవి జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆమె, పరీక్షల సరళిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గదుల్లోని గాలి, వెలుతురు, తాగునీరు వంటి కనీస సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉన్నందున ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాల్ప్రాక్టీస్కు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు లోపలికి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట కళాశాలల ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
222 మంది గైర్హాజరు
జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8,395 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనరల్ విభాగంలో 6,067 మందికిగాను 5,968 మంది, వొకేషనల్ విభాగంలో 2,550 మందికిగాను 2,427 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 8,617 మంది విద్యార్థులకుగాను 222 మంది గైర్హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


