జీఆర్పీ అదుపులో సెల్ఫోన్ల చోరీ నిందితుడు
విజయనగరం క్రైమ్: రైల్వే ప్లాట్ఫాంలలో, స్టేషన్లలో, రైళ్లలో సెల్ఫోన్ లను దొంగిలించే నిందితుడ్ని విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని కటక్కు చెందిన పియ్యాల భిషాల్ ప్రయాణికుల మాదిరిగానే రైల్వే స్టేషన్ లకు వెళ్తూ..ట్రైన్లలో, స్టేషన్లో ప్లాట్ ఫాం లవద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికుల సెల్ ఫోన్ లను అపహరిస్తూ ఉండేవాడు. ఇటీవల స్టేషన్ లో సెల్ఫోన్ పోయిందని ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన జీఆర్పీ సిబ్బంది ఎట్టకేలకు బిషాల్ ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువ చేసే మూడు 3 మొబైల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రైల్వేకోర్టులో ప్రవేశ పెట్టినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీరావు వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వేపాడ: మండలంలోని అరిగిపాలెం సమీపంలో ఆటో నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడకు చెందిన గొట్టిపాటి నాగరాజు ఆదివారం సోంపురం జంక్షన్ నుంచి వేపాడ వస్తుండగా అరిగిపాలెం సమీపంలో ఆటో నుంచి జారి రోడ్డుపై పడడంతో తలకు త్రీవమైన గాయం కాగా విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు తరలించిన విషయం విదితమే. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందడంతో మృతుడి కుమారుడు తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై నాగేశ్వర్రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ కేజీహెచ్లో పోస్ట్మార్ట అనతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
రాజుపేటలో ఏనుగుల సంచారం
● మొక్కజొన్న పంట ధ్వంసం
బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధి రాజుపేట గ్రామంలో ఏనుగులగుంపు సంచరించి ఆందోళన సృష్టించింది. సీతానగరం మండలం బక్కుపేట నుంచి ఆదివారం రాత్రి రాజుపేట గ్రామానికి చేరుకున్న ఎనిమిది ఏనుగుల గుంపు మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయగా, అపరాలు, చెరకు పంటలను నాశనం చేశాయి.రాజుపేట గ్రామానికి చెందిన కర్రి మన్మధరావు, అప్పలనాయుడుల రెండున్నర ఎకరాల మొక్కజొన్న పంటను, కళ్లాల్లో ఉన్న రైతుల ధాన్యం నిల్వలను ధ్వంసం చేశాయి. సోమవారం ఉదయం రాజుపేట నుంచి సీతయ్యపేట గ్రామానికి చేరుకుని గ్రామ శివారులోని కళ్లాల్లో ఏనుగులు తిష్ఠవేశాయి. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది వాటిని పర్యవేక్షిస్తున్నారు.ఏనుగుల గుంపు వద్దకు ఎవరూ వెళ్లకుండా గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు. ఏనుగులు మళ్లీ తిరిగి వెళ్లేవరకు ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగుల గుంపునుంచి ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
జీఆర్పీ అదుపులో సెల్ఫోన్ల చోరీ నిందితుడు


