ఫేక్ ప్రచారంలో కూటమిది ప్రపంచ రికార్డు
చీపురుపల్లి: ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీస్ వ్యవస్థతో పరిపాలన సాగిస్తూ.. ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామంటూ ప్రజలను మభ్యపెడుతూ.. కూటమి ప్రభుత్వం ఫేక్ ప్రచారంలో ప్రపంచ రికార్డు సాధించిందని వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ) మెంబర్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చీపురుపల్లిలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన మండలి విపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ పైడితల్లి అమ్మవారి జాతరకు హాజరవుతున్నట్టు టూర్షెడ్యూల్ విడుదల చేస్తే, డీసీసీబీ బొత్స జాగీరా అని ప్రశ్నించిన వారు సాంప్రదాయాలు కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం వార్డు మెంబరు పదవి కూడా లేని కిమిడి రామ్మల్లిక్నాయుడు నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుంటే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునకు సాంప్రదాయాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇద్దరు రైల్వేమంత్రులతో మాట్లాడి, రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) అవసరాన్ని వివరించి, నిర్మాణానికి రూ.12.99 కోట్లు నిధులు తీసుకొచ్చిన ఘనత ఎవరిదో తెలుసుకుని మాట్లాడాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 75 శాతం ఆర్ఓబీ పనులు పూర్తయ్యాయన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసినందుకు కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్టర్ను అభినందించామన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ప్రారంభోత్సవం చేశారని, రిబ్బన్లు కట్ చేశారంటూ ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ఎన్నికలు వచ్చేసరికి ఉత్తుత్తి శంకుస్థాపనలు చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. అందులో భాగంగానే 2019 చివరిలో భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉత్తుత్తి శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అంటూ చెబు తున్న చంద్రబాబు అక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారో చూపించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, పోర్టులు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్సెంటర్, సచివాలయ వ్యవస్థ, పాఠశాలలు అభివృద్ధి.. సాగుకు సరికొత్త సాయం, మహిళా సంక్షేమం.. ఇలా ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఒక్క అభివృద్ధి పని చూపించగలరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ కాపీ కొట్టి క్రెడిట్ చోరీకు పాల్పడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన సాగించాల్సిన ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టకుని రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం విచారకరమన్నారు. ఎక్కడ చూసినా కక్షసాధింపు చర్యలు, అరెస్టులు తప్ప ఇంకేం లేదన్నారు.
రేగిడి, రామలింగాపురంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా...
ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు స్వగ్రామమైన రేగిడి ఆమదాలవలస, చీపురుపల్లి మండలంలోని ఎంపీపీ ఇప్పిలి వెంకటనర్శమ్మ స్వగ్రామం రామలింగాపురం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం సవాల్ విసిరారు. దశాబ్దాలు తరబడి పదవుల్లో కొనసాగడం కాదని, ప్రజలకు మేలుచేసే పనులు చేయగలగాలన్నారు. ఆర్ఈసీఎస్ను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల ముందు అమ్మవారి సాక్షిగా ఇచ్చిన హామీను ముందు నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి దన్నాన జనార్దనరావు, పార్టీ నాయకులు గిరడ రాందాసు, ముల్లు పైడిరాజు, కంచుపల్లి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత
వైఎస్సార్సీపీదే..
చీపురుపల్లి ఆర్ఓబీకి నిధులు
తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ
హయాంలోనే
ఎన్నికల ముందు ఫేక్ శంకుస్థాపనలు చంద్రబాబుకు అలవాటు
గ్రామాల్లో అభివృద్ధిపై బహిరంగ చర్చకు టీడీపీ రావాలి
మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్
బెల్లాన చంద్రశేఖర్


