
మన ఊరు బాగుచేసుకుందాం
● కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి పిలుపు
● స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ప్రారంభం
● 12 మంది పారిశుధ్య కార్మికులకు సత్కారం
విజయనగరం: రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును బాగుచేసుకుందామని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కలెక్టరేట్ను 9 విభాగాలుగా విభజించి, వివిధ ప్రభుత్వ శాఖలకు అప్పగించడం ద్వారా పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాత్ నినాదంతో ముందడుగు వేయాలని కోరారు. కనీసం రోజుకో గంటపాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని సూచించారు. మన ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. దీనివల్ల పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, వివిధ రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందని సూచించారు. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన ఊరు బాగుండాలంటే అందుకు మనమే ముందుడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ కొంతమంది చెత్తను పారిశుధ్య కార్మికులకు ఇవ్వకుండా, కాలువల్లోను, రోడ్ల పక్కన వేసేస్తున్నారన్నారు. ఈ అలవాటును మానుకోవాలని, కార్మికులు ఇంటివద్దకు వచ్చినప్పుడే చెత్తను అందజేయాలని సూచించారు. మన విజయనగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతిఒక్కరూ తమవంతు సహకారాన్ని అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవనన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, ఇతర అధికారులు, పలువురు నాయకులు, వివిధ శాఖల సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
పార్వతీపురంటౌన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పరిసరాలు అందంగా కనిపించడంతో పాటు ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలని కోరారు. తద్వారా మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ పరిధిలోని 8వ వార్డులో గల కొత్తవలస చెరువు వద్ద స్వచ్ఛత హి సేవ –2025లో భాగంగా ఏక్ దిన్..ఏక్ గంట..ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శ్రమదానం చేయగా, మునిసిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, కౌన్సిలర్ కోరాడ నారాయణరావు, కమిషనర్ జి.శ్రీనివాసరాజు భాగస్వామ్యమై శ్రమదానం చేసి చెరువు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ మనందరి బాధ్యతగా గుర్తెరగాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మన ఊరు బాగుచేసుకుందాం

మన ఊరు బాగుచేసుకుందాం