
వైద్యరంగంలో ఫార్మసిస్టులు కీలకం
● వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం
● రోగులకు అందించింది వారే
● నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం
విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో ఫార్మసిస్టులపాత్ర చాలా కీలకమైనది. వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం వారిదే. రోగి వ్యాధి తగ్గించడంలో వైద్యుడి పాత్ర ఎంత ఉంటుందో, ఫార్మసిస్టు పాత్ర కూడా అంతే ఉంటుంది. రోగిని పరీక్షించిన వైద్యుడు వ్యాధి తగ్గడానికి అవసరమైన మందులు రాసి ఇస్తారు. వైద్యుడు సూచించిన మందులను చూసి మార్చకుండా కచ్చితమైన మందులు అందించేది ఫార్మసిస్టులే. గురువారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం.
వ్యాధిని తగ్గించడంలో ఫార్మసిస్టులే కీలకం
రోగికి మందులు అందించడం ద్వారా ఫార్మసిస్టులు వ్యాధిని తగ్గిస్తారు. అయితే మందులు అందించడంలో ఫార్మసిస్టులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వైద్యుడు సూచించిన మందులు ఒకదానికి బదులు ఇంకొకటి ఇచ్చినా, కాలపరిమితి దాటిన మందులు అందించినా రోగుల ప్రాణాల మీదికి వస్తుంది. కోవిడ్ సమయంలో ఫార్మసిస్టులు వైద్యులతో సమానంగా వారితో కలిసి కోవిడ్ బారిన పడిన వారికి మందులు అందించారు. ప్రపంచంలో మొదటి సారి 2009 సెప్టెంబర్ 25న ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారత దేశంలో 2013 లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్లో ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 2014లో సెప్టెంబర్ 25నుంచి మన దేశంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఫార్మసిస్టులు చేసే పనులు
మందులు నిల్వ చేస్తారు. అదేవిధంగా వ్యాక్సిన్ను నిర్దేశించిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో పనిచేసే ఫార్మసిస్టులు పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రులకు మందులు పంపిణీ చేస్తారు. ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే ఫార్మసిస్టులు వైద్యులు రాసి ఇచ్చిన చీటీ ప్రకారం రోగులకు మందులు అందిస్తారు. అదేవిధంగా ఆయా ఆస్పత్రులకు ఎన్ని రకాలు మందులు? ఎంత కావాలో? ఆన్లైన్లో ఇండెంట్ పెడతారు. అలాగే మందులు ఇచ్చే మందు రోగులకు ఫార్మసిస్టులు కౌన్సెలింగ్ ఇస్తారు. ఏ రకం మందు ఏ సమయంలో ఎంత మోతాదులో వేసుకోవాలో వివరంగా తెలియజేస్తారు.
జిల్లాలో 1500మందికి పైగా ఫార్మసిస్టులు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, మందులు దుకాణాలు అనేకం ఉన్నాయి. పీహెచ్సీలు 50 ఉన్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 18 ఉన్నాయి. సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు ఏడు ఉన్నాయి. బోధనాస్పత్రి, ఘోషా ఆస్పత్రి ఒక్కొక్కటి ఉన్నాయి. అదేవిధంగా 800 వరకు మందులు దుకాణాలు, 200 నుంచి 300 వరకు క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. వాటిల్లో 1500 మందికి పైగా ఫార్మసిస్టులు పనిచేస్తున్నారు.