
ప్రొటోకాల్ రగడ
నన్ను దారుణంగా అవమానించారు
ఈ నెల 16న పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం మేరకే వెళ్లాను. కానీ నన్ను లోపలకు వెళ్లనివ్వలేదు. నాకు ఆప్షనల్ నియోజకవర్గమైన పాలకొండలో మండల సమావేశానికి రాకుండా ముఖద్వారం వద్దనే ఆపేశారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు భౌతికంగా తోసేశారు. నన్ను దారుణంగా అవమానపరిచారు. ఆహ్వానం పంపిన ఎంపీడీఓను వివరణ అడిగితే ‘అవగాహన లేక పని ఒత్తిడిలో చూసుకోక ఆహ్వానం పంపించాం.. ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నామంటూ.’ లేఖలో సమాధానం ఇచ్చారు. ఇలాంటి అధికారులతో ప్రభుత్వం పని చేయించుకుంటుందా. ఒక ఎమ్మెల్సీగా నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే జెడ్పీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఏంటి. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పాలకొండ ఎంపీడీఓపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. జెడ్పీ సీఈఓపైనా విచారణ జరగాలి.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ
నన్నే చాలాసార్లు పిలవలేదు
చట్ట సభ్యులను కూడా అవమానించడం దారుణం. ఇటీవల ఇచ్ఛాపురంలో జిల్లా పరిషత్ నిధులతో ఆర్డబ్ల్యూఎస్ పథకాల ప్రారంభోత్సవానికి నాకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాకపోయినా ఈ చైర్కు అయినా విలువ ఇవ్వాలి కదా. – పిరియా విజయ,
శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్
అరసవల్లి: జిల్లా పరిషత్ చరిత్రలో తొలిసారిగా సర్వసభ్య సమావేశంలో అధ్యక్షురాలితో సహా సభ్యులంతా వాకౌట్ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్ను ఇటీవల పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకాకుండా నిలువరించడమే కాకుండా భౌతిక దాడికి సైతం పాల్పడిన సంగతి విదితమే. దీనిపై ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈనెల 16న పాలకొండలో జరిగిన ఈ ఘటనకు బాధ్యుడైన పాలకొండ ఎంపీడీఓపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి జెడ్పీటీసీ సభ్యులపై అమానుషంగా ఏకవచనంతో మాట్లాడిన జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వీ శ్రీధర్రాజాపై విచారణకు ఆదేశించాలని సభ్యులంతా పట్టుపట్టడంతో సభ హీటెక్కింది. అనంతరం సీఈఓ తీరును నిరసిస్తూ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పాలకొండ సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రాజా తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించాలి..
జిల్లాలో అన్ని శాఖల అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలి. ప్రొటోకాల్ పాటించాలి. ప్రొటోకాల్ విషయంలో అనుమానాలు ఉంటే జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. ఇచ్ఛాపురం ప్రొటోకాల్ ఉల్లంఘన నా దృష్టికి వచ్చింది. ఇలాంటివి మళ్లీ జరగకూడదు. పాలకొండ అంశంపై జెడ్పీ సీఈఓ విచారణ జరపాలి.
– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కలెక్టర్

ప్రొటోకాల్ రగడ

ప్రొటోకాల్ రగడ