ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ రగడ

Sep 22 2025 5:59 AM | Updated on Sep 22 2025 5:59 AM

ప్రొట

ప్రొటోకాల్‌ రగడ

జెడ్పీ సీఈఓపై ధ్వజం ఎమ్మెల్సీ విక్రాంత్‌కు జరిగిన అవమానంపై జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సిరిపురపు జగన్మోహనరావు స్పందిస్తూ ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా ఎంపీడీఓపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్‌ రాజా బదులిస్తూ కమిషనర్‌కు నివేదించానని, తదనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో ‘నేను చెప్పింది విను ముందు’ అనడం సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ను ఏకవచనంతో పిలవడమేంటని పోడియంను చుట్టుముట్టారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ కూడా జత కలిశారు. పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకునేంత వరకు సభ జరగదని అంతా వాకౌట్‌ చేశారు. సభలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, హిరమండలం టీడీపీ జెడ్పీటిసీ బుచ్చిబాబు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌లు మాత్రమే కూర్చుండిపోయారు. అనంతరం సభ వాయిదా పడిందని జెడ్పీ సీఈఓ ప్రకటించారు. సభలో ఆందోళన ● టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న చట్టసభ్యులందరికీ గౌరవంగా ప్రోటోకాల్‌ పాటించామని గుర్తుచేశారు. గతంలో ఆహ్వానాలు పంపినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు ఏనాడూ రాలేదన్నారు. ● వంగర ఎంపీపీ సురేష్‌ ముఖర్జీ మాట్లాడుతూ ఎమ్మెల్సీకి సమావేశానికి ఆహ్వానించి మళ్లీ వెనక్కి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ● ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ ప్రతి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆప్షన్ల ప్రకారం శాశ్వత ఆహ్వానితులే అని గుర్తుచేశారు. చట్టసభ్యులనే లోపలికి రానివ్వని సంస్కృతి దారుణమన్నారు. ● జి.సిగడాం జెడ్పీటీసీ కాయల వెంకట రమణ మాట్లాడుతూ జిల్లాలో అన్ని స్థాయిల్లో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు కూడా ప్రోటోకాల్‌ పాటించడం లేదని తెలిపారు. ● రాజాం జెడ్పీటీసీ నర్సింహులు, బూర్జ జెడ్పీటీసీ రామారావు, రణస్థలం జెడ్పీటీసీ టొంపల సీతారాం, వీర ఘట్టం జెడ్పీటీసీ జంపు కన్నతల్లి, సీతంపేట జెడ్పీటీసీ బిడ్డిక ఆదినారాయణ, సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్‌రెడ్డిలు మాట్లాడుతూ విక్రాంత్‌కు జరిగిన అవమానం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.

నన్ను దారుణంగా అవమానించారు

ఈ నెల 16న పాలకొండ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం మేరకే వెళ్లాను. కానీ నన్ను లోపలకు వెళ్లనివ్వలేదు. నాకు ఆప్షనల్‌ నియోజకవర్గమైన పాలకొండలో మండల సమావేశానికి రాకుండా ముఖద్వారం వద్దనే ఆపేశారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు భౌతికంగా తోసేశారు. నన్ను దారుణంగా అవమానపరిచారు. ఆహ్వానం పంపిన ఎంపీడీఓను వివరణ అడిగితే ‘అవగాహన లేక పని ఒత్తిడిలో చూసుకోక ఆహ్వానం పంపించాం.. ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నామంటూ.’ లేఖలో సమాధానం ఇచ్చారు. ఇలాంటి అధికారులతో ప్రభుత్వం పని చేయించుకుంటుందా. ఒక ఎమ్మెల్సీగా నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే జెడ్పీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఏంటి. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పాలకొండ ఎంపీడీఓపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. జెడ్పీ సీఈఓపైనా విచారణ జరగాలి.

– పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్సీ

నన్నే చాలాసార్లు పిలవలేదు

చట్ట సభ్యులను కూడా అవమానించడం దారుణం. ఇటీవల ఇచ్ఛాపురంలో జిల్లా పరిషత్‌ నిధులతో ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాల ప్రారంభోత్సవానికి నాకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాకపోయినా ఈ చైర్‌కు అయినా విలువ ఇవ్వాలి కదా. – పిరియా విజయ,

శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌

అరసవల్లి: జిల్లా పరిషత్‌ చరిత్రలో తొలిసారిగా సర్వసభ్య సమావేశంలో అధ్యక్షురాలితో సహా సభ్యులంతా వాకౌట్‌ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్‌ను ఇటీవల పాలకొండ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరుకాకుండా నిలువరించడమే కాకుండా భౌతిక దాడికి సైతం పాల్పడిన సంగతి విదితమే. దీనిపై ఆదివారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈనెల 16న పాలకొండలో జరిగిన ఈ ఘటనకు బాధ్యుడైన పాలకొండ ఎంపీడీఓపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి జెడ్పీటీసీ సభ్యులపై అమానుషంగా ఏకవచనంతో మాట్లాడిన జెడ్పీ సీఈఓ ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజాపై విచారణకు ఆదేశించాలని సభ్యులంతా పట్టుపట్టడంతో సభ హీటెక్కింది. అనంతరం సీఈఓ తీరును నిరసిస్తూ సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. సమావేశంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, పాలకొండ సబ్‌కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రాజా తదితరులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్‌ పాటించాలి..

జిల్లాలో అన్ని శాఖల అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలి. ప్రొటోకాల్‌ పాటించాలి. ప్రొటోకాల్‌ విషయంలో అనుమానాలు ఉంటే జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. ఇచ్ఛాపురం ప్రొటోకాల్‌ ఉల్లంఘన నా దృష్టికి వచ్చింది. ఇలాంటివి మళ్లీ జరగకూడదు. పాలకొండ అంశంపై జెడ్పీ సీఈఓ విచారణ జరపాలి.

– స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, కలెక్టర్‌

ప్రొటోకాల్‌ రగడ1
1/2

ప్రొటోకాల్‌ రగడ

ప్రొటోకాల్‌ రగడ2
2/2

ప్రొటోకాల్‌ రగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement