
రైతులను పట్టించుకోని పీఏసీఎస్
కూటమి నాయకులే పంపిణీ చేస్తే అధికారులు ఎందుకు?
పీఏసీఎస్కు ఇప్పటివరకు 1344 యూరియా బస్తాలు వస్తే కనీసం రైతులకు సమాచారం ఇవ్వలేదు. అధికారులు అధికారికంగా పంపిణీ చేపట్టలేదు. కూటమి నాయకులు యూరియాను పంపిణీ చేశారు. దీనికి సీఈఓ సహకరించారు. మరి అటువంటప్పుడు పీఏసీఎస్లో అధికారులెందుకు? పీఏసీఎస్కు యూరియాను పంపడ మెందుకు? నాయకులకే పంపిస్తే బాగుండేది.
– సిరిపురపు జగన్మోహన్రావు,
జెడ్పీ వైస్ చైర్మన్
సంతకవిటి: మండలంలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మండల కేంద్రం సంతకవిటి ప్రాథమిక సహకార సంఘానికి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు 1344 యూరియా బస్తాలు వచ్చాయి. వాటిని రైతులకు అందించడంలో సొసైటీ సీఈఓ విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియాను పీఏసీఎస్ గోడౌన్లో కాకుండా సచివాలయంలో దించడంలోనే పెద్ద మెలిక ఉందని రైతులు వాపోతున్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేట్ దుకాణాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్న పరిస్థితి. సెప్టెంబర్ 12న మండల కేంద్రంలోని వినాయక ట్రేడర్స్ వద్ద యూరియ కోసం క్యూలో రైతులు నిల్చున్న సమయంలోనే కోరమాండల్ దుకాణానికి లారీతో యూరియా వెళ్తుంటే లారీ వెనుక కొంతమంది రైతులు పరుగెడుతూ కోరమాండల్ షాప్కు చేరుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు మండలంలో రైతులు యూరియా కోసం ఎంత యుద్ధం చేస్తున్నారో? అటువంటి పరిస్థితులు తెలిసికూడా నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ ద్వారా యూరియా పంపిణీని కూటమి నాయకులే చేపట్టడం విశేషం. అదే రోజు సీఈఓ సెలవులో ఉండడం గమనార్హం. కనీసం అధికారికంగా అయినా పంపిణీ చేపట్టలేదు. దీనిపై సీఈఓ రమణను సాక్షి వివరణ కోరగా జూలైలో 900 బస్తాలు రావడంతో అప్పుడే పంపిణి చేపట్టామని,
సెప్టెంబర్ 11 రాత్రి 444 బస్తాల యూరియా పీఏసీఎస్కు వచ్చిందని, పీఏసీఎస్ గోడౌన్ కారుతుండడంతో సచివాలయం గొడౌన్లో దింపామన్నారు. 12, 13 తేదీలలో సెలవులో ఉన్నాను. ఈ రెండు రోజుల్లో చైర్మన్ ఆదేశాలతోనే యూరియా పంపిణీని చేపట్టామని తెలిపారు. యూరియా పంపిణీ విషయంలో కనీసం మండల రైతులకు ముందస్తు సమాచారం లేదని, ఈ యూరియా మొత్తం కూటమి నాయకుల ఇళ్లకు చేరిందని రైతులు వాపోతున్నారు. 445 మంది రైతులకు యూరియా అందించామని సీఈఓ తెలిపారు. కనీసం ఒక రైతుకు ఒక యూరియ బస్తా ఇచ్చినా దాదాపు 1300 మంది రైతులకు లబ్ధి చేకురేదని రైతులు వాపోతున్నారు. కమీషన్కు కక్కుర్తి పడ్డ సీఈఓ యూరియా నేరుగా రైతులకు పంపిణీ చేయకుండా అడ్డగోలుగా వ్యవహరించారని రైతులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
సంతకవిటికి వచ్చిన 1344 యూరియా బస్తాలు
అధికారికంగా చేపట్టని పంపిణీ
గోప్యంగా కూటమి నాయకులకు చేరిన యూరియా
సొసైటీ సీఈఓ నిర్వాకమని
ఆరోపిస్తున్న రైతులు

రైతులను పట్టించుకోని పీఏసీఎస్

రైతులను పట్టించుకోని పీఏసీఎస్