
పండగ శోభ ప్రతిబింబించాలి
● సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీ దర్శనాలు
● పైడితల్లి అమ్మవారి పండగ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి తెలిపారు. ప్రతి దశలోనూ అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల వారికి కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా పండగ నిర్వహించాలన్నారు. వీఐపీ దర్శనాల వల్ల సాధారణ భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. సిరిమాను తిరిగే ప్రదేశంలో ఎక్కడా రోడ్డుపై గుంతలు లేకుండా చూడాలని, అలాగే పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, బయో టాయిలెట్స్ ఏర్పాటు, నగరమంతా సుందరీకరణ, విద్యుత్ అలంకరణ తదితర పనులను మున్సిపల్ శాఖ నిర్వహించాలని సూచించారు. పండగలో ప్లాస్టిక్ను వినియోగించకుండా చూడాలని, క్యూల వద్ద ఏర్పాటు చేసిన తాగునీరు పేపర్ గ్లాస్ల ద్వారా అందించాలని వాటిని జాగ్రత్తగా వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రసాదాలను ఫుడ్ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలని అలాగే అన్ని ఆర్ఓప్లాంట్లను ఆర్డీఓ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని సూచించారు.
శాంతిభద్రతల లోపం ఉండరాదు
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, అత్యవసర చికిత్సకు అవసరమైన మందులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా 6, 7 తేదీల్లో తొలేళ్లు, సిరిమాను ఉత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తారని శాంతి భద్రతల లోపం లేకుండా చూడాలని పోలీస్ శాఖకు సూచించారు.
వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లను చేయాలని, పోలీస్, ఫైర్ శాఖల అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బారికేడింగ్ ఎత్తు పెంచాలని లేదంటే పైనుంచి దూకి వస్తున్నారని పోలీస్ వారు చేసిన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ 4 అడుగుల నుంచి 5 అడుగులకు పెంచాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. తెప్పోత్సవంలో గజ ఈతగాళ్లు ఉండాలని, మత్స్యవారికీ, తెప్పలను తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆర్అండ్బీ శాఖకు సూచించారు.
నగరమంతా సుందరీకరించాలి
సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అక్టోబర్ 1 నుంచి 7 వరకు నగరమంతా సుందరీకరణ చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రి సూచించారని, ఆయన ఆదేశాల మేరకు సోషల్ మీడియా, సుందరీకరణ, ఎల్.ఈ.డీ స్క్రీన్ల ఏర్పాటు చేయాలని సమాచార శాఖ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ దాట్ల కీర్తి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, పూజారి బంటుపల్లి వెంకటరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

పండగ శోభ ప్రతిబింబించాలి