
రైల్లో తనిఖీలు
పార్వతీపురం రూరల్: గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించేందుకు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాయపూర్ పాసింజర్ రైల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్స్క్వాడ్, ఈగల్ టీం సంయుక్తంగా పార్వతీపురం రూరల్ సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్లో, భోగీలలో ప్రయాణికుల లగేజీలను, అనుమానితులను తనిఖీ చేసినట్లు ఆమె చెప్పారు.
అప్రమత్తంగా ఉండి సమాచారం ఇవ్వండి
సాలూరు పట్టణంలో సోమవారం జరిగిన చైన్స్ స్నాచింగ్కు సంబంధించిన నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరి మీదనైనా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సంతోషి కోరారు. ఈ సందర్భంగా నిందితులు పరారవుతున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాలను ఆమె విడుదల చేశారు.
భవనంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి
పార్వతీపురం రూరల్: జిల్లాకేంద్రంలోని సౌందర్య థియేటర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనం పైనుంచి శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆరిక మోహనరావు(43) అనే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. ఈ మేరకు ప్రాధమిక విచారణలో నిర్ధారించినట్లు పార్వతీపురం పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. మృతుడు కిందికి ప్రమాదవశాత్తు జారిపడిన సమయంలో సమీపంలో గల కళాశాల విద్యార్థి ఒకరు చూసినట్లు ఎస్సై చెప్పారు. కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ లిక్కిడిగూడ గ్రామానికి చెందిన మోహనరావు భార్య సుహాసిని ఇటీవల మరణించింది. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధురాలి మెడలో
బంగారు గొలుసు చోరీ
సాలూరు: పట్టణంలోని రామాకోలనీలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రామా కాలనీకి చెందిన అక్కేరపు సత్యవతి(65) సోమవారం మధ్యాహ్నం ఇంటిలో నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి తలుపుకొట్టడంతో ఆమె బయటకు వచ్చింది.ఆమెకు ఇంటిపక్కనే ఖాళీగా ఉన్న రెండో ఇల్లు అద్దెకు కావాలని, ఇల్లు చూపించమని ఆ వ్యక్తులు కోరారు. ఈ క్రమంలో ఇంట్లో బెడ్ రూం ఎక్కడ ఉందో చూపించమనగా ఆమె ఇంటిలోకి వెళ్లింది. దీంతో ఓ వ్యక్తి ఆమె చేతులను గట్టిగా పట్టుకోగా రెండో వ్యక్తి ఆమె మెడలో గల సుమారు 5 తులాల బంగారు గొలుసును తెంపేసి వెంటనే ఓ స్కూటీపై పరారయ్యారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా అప్పటికే దొంగలు పారిపోయారు. తరువాత ఆమె స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు తాడ్డి రమణ తదితరులతో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

రైల్లో తనిఖీలు

రైల్లో తనిఖీలు