
ఇబ్బందులు పడుతున్నాం..
విజయనగరం అర్బన్/బొబ్బిలి/సంతకవిటి:
చదువుతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని, అందరికీ సమాన విద్యావకాశాలు అందాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో విద్యావెలుగులు నింపారు. అనంతరం ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదకుటుంబాల పిల్లల చదువుకు పెద్దపీట వేశారు. ప్రభుత్వ బడులు, కళాశాలలను బలోపేతం చేశారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలతో పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ను వర్తింపజేశారు. విద్యార్థులకు చదువు కష్టాలను దూరం చేశారు. ఆర్థిక కష్టాలతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కారాదన్న లక్ష్యంతో గత ఐదేళ్లూ ఫీజురీయింబర్స్మెంట్ నిధులను ఠంచన్గా విడుదల చేశారు. పేదకుటుంబాల్లో విద్యా దీపం వెలిగించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థుల చదువుకు ఆధారమైన ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని ఎండమావిగా మార్చింది. అధికారం చేపట్టి పది నెలలు గడిచినా నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. ఇది విద్యార్థులకు శాపంగా మారింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారంమోపుతోంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజులకోసం ఒత్తిడి చేయడం, హాల్టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అప్పులుచేసి చెల్లిస్తున్నారు. కొందరు విద్యార్థులు డబ్బులు కట్టలేక, చదువు సాగించే అవకాశం లేక మానసికంగా కుంగిపోతున్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ చెల్లించాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలో విద్యాదీవెన పథకానికి అర్హులైన 35,585 మందికి గడిచిన ఏడాదికి మంజూరు చేయాల్సిన రూ.24.24 కోట్లు బకాయి ఉంది. విద్యాసంవత్సరం ముగుస్తున్నా నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. గడిచిన ఐదేళ్ల పాలనలో విద్యాదీవెన రూపంలో 2,08,960 మంది విద్యార్థులకు రూ.339 కోట్లు, వసతి దీవెన రూపంలో 1,65,232 మంది విద్యార్థులకు రూ.180.69 కోట్ల నిధులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. చదువుకు ఆర్థిక కష్టాలు లేకుండా చేసింది.
ఈ ఫొటోలోని వ్యక్తిపేరు రాజాపు రమణ. సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన ఈయన కుమారుడు రాజాంలోని ఓ ప్రైవేట్ ఐటీ కళాశాలలో బీటెక్ థర్డ్ఇయర్ చదువుతున్నాడు. ఒక విడత ఫీజు రీయింబర్స్మెంట్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన మూడు విడతలు ఫీజు విడుదలకాక పోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని పట్టుబట్టింది. చేసేదిలేక అప్పుచేసి రూ.55,000 ఫీజు చెల్లించారు. ఫీజు రాయితీ వస్తుందని తమ కుమారుడిని ఐటీ చదివిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయమే ఆధారంగా జీవించే తమలాంటి చాలామంది రైతులు, రోజువారీ వేతనదారులు తమ పిల్లలను బీటెక్, డిగ్రీలు చదివిస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించకుంటే చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోయారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం చేస్తున్న ప్రభుత్వం
ఫీజులు చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి
హాల్టికెట్లు, సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ
అప్పులు చేసి ఫీజు చెల్లిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ఇబ్బందులు పడుతున్నాం..