పరీక్షా కేంద్రం వద్ద హాల్టికెట్ తనిఖీ
చెవి రింగులు తీస్తూ...
విశాఖ విద్య: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ–ఎగ్జామ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లాలోని మొత్తం 18 పరీక్షా కేంద్రాల్లో అధికారుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షను నిర్వహించారు. జిల్లాలో వ్యాప్తంగా 8,015 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7,298 మంది పరీక్షకు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. హాజరైన అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. 5,679 మంది మహిళా అభ్యర్థులు, 1,619 మంది పురుష అభ్యర్థులు పరీక్ష రాశారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నీట్ రీ–ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష ప్రక్రియ సాగింది. అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీరు, వైద్య సిబ్బంది వంటి కనీస సదుపాయాలను సైతం పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు.
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు
తెల్లవారుజాము నుంచే అభ్యర్థులను తల్లిదండ్రులు స్వయంగా పరీక్షా కేంద్రాలకు తీసుకువచ్చారు. తమ పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యం చెబుతూ, వెంట తోడుగా నిలిచారు. కొందరు తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు కేంద్రాల బయటే వేచి ఉన్నారు.
అభ్యర్థుల్లో ఉద్వేగ వాతావరణం
నీట్ రీ–ఎగ్జామ్ కావడంతో హాజరైన అభ్యర్థుల్లో ఒక విధమైన ఉద్వేగ వాతావరణం స్పష్టంగా కనిపించింది. చాలా మంది అభ్యర్థుల ముఖాల్లో ముభావత, ఆందోళన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరోసారి పరీక్ష రాయాల్సి రావడంతో మానసికంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జేసీ విద్యాధరితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయ–2 పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
నాన్నతోడుగా...
పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు


