మహారాణిపేట: ఆర్కే బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆక్వా స్టోర్స్ కాంప్లెక్స్ వరకు మద్యం ఖాళీ సీసాలను మెడలో ధరించి ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు వై. రాంబాబు, ఎం.ఏ. బేగం, యు. నాగరాజులు మాట్లాడుతూ విశాఖ బీచ్ను కుటుంబాలతో కలిసి సందర్శించే ప్రశాంత ప్రాంతంగా కొనసాగించాలని, జీవో నెం. 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


