గోపాలపట్నం: బుచ్చిరాజుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన దండు సుబ్బారావు (69) ఎన్ఏడీలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుచ్చిరాజుపాలెం బస్స్టాప్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


