వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు
మహారాణిపేట: వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కానూరు కారుమూరి సునీల్ కుమార్ను అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం తీవ్రంగా ఖండించింది. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజా దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సునీల్ కుమార్పై తప్పుడు కేసు బనాయించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లు నడుస్తున్నాయని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. విశాఖ, బాపట్ల వంటి తీర ప్రాంతాల్లో గోవా తరహా ‘బీచ్ లిక్కర్ సంస్కృతి’ని తీసుకురావాలని ప్రభుత్వం చూడడం వల్ల మహిళల భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీచ్లలో మద్యం విక్రయాల వల్ల మహిళల భద్రత దెబ్బతింటుందని, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ మద్యం విధానాలను పునఃసమీక్షించాలని, సునీల్ కుమార్పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు జగ్గుపల్లి నరేష్, రవి కిరణ్, నాగిరెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


