ఆరిలోవ: జీవీఎంసీ13వ వార్డు పరిధి గిరిజన గ్రామం శ్రీకృష్ణాపురంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన యువకుడు విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఆరిలోవ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇరువురు యువకులు టీడీపీకి చెందినవారు కావడంతో తూర్పు ఎమ్మెల్యే రంగంలోకి దిగి కేసు లేకుండా చూడాలని ఆరిలోవ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన యువకుడు మారిక శివకుమార్ తండ్రి జక్కన్న తెలిపిన వివరాలు ప్రకారం.. దగ్గర బంధువైన బత్తిన అప్పలరాజు ఆస్తి వ్యవహారంలో తన కుమారుడితో తరుచూ గొడవకు దిగుతున్నాడన్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే వ్యవహారంలో తన కుమారుడిపై దాడి చేయగా..స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కుమారుడు శివకుమార్పై అప్పలరాజు కత్తితో దాడి చేశాడని, అప్పలరాజు వల్ల నా కుమారుడు, మా కుటుంబానికి ప్రాణ హాని ఉందని జక్కన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్ని రాజకీయం చేకుండా పోలీసులు కేసు నమోదు చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబీకులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సూచనలతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు కేసు లేకుండా పోలీసులుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి.


