బీచ్రోడ్డు: జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని క్రీడా మైదానాలను నిర్మించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు జీవీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. వీరికి ప్రభుత్వం తరఫున మరింతగా సహాయ సహకారాలు అందిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారన్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రత్యేకంగా ఒక ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ హెడ్ కోచ్ ఎం.శేషు మోహన్, కోచ్లు వి.మోహన్ కుమార్, ఎస్.గణేష్, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


