ముఖ్యమంత్రి దత్తత గ్రామంలోనే దాడి జరగడం ఆందోళనకరం కూటమి ప్రభుత్వంలో యాదవుల ప్రయోజనాలకు గండి పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ మౌనం వీడాలి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా యాదవ విభాగం అధ్యక్షుడు ఎడ్ల సుమన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా యాదవులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా యాదవ విభాగం అధ్యక్షుడు ఎడ్ల సుమన్ స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ యాదవ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలోని ఈదుముడి గ్రామంలో గొర్రెలు, మేకలను మేపేందుకు వెళ్లిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మధు, అనిల్లపై జరిగిన దాడిని ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత గ్రామంలోనే యాదవ సామాజిక వర్గాన్ని అవమానిస్తూ కులదూషణలకు పాల్పడటం, వారిపై అమానుషంగా దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా చెప్పుకునే పల్లా శ్రీనివాసరావు ఈ ఘటనపై స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో యాదవుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం యాదవుల కోసం కేటాయించిన 50 సెంట్ల భూమి అంశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండా వదిలేయడం యాదవ సమాజానికి జరుగుతున్న తీవ్ర అన్యాయమన్నారు. యాదవుల ఓట్లతో రాజకీయంగా ఎదిగి, వారి సమస్యల పట్ల మౌనం వహిస్తే సమాజం ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యాదవ నాయకులు పల్లా దుర్గారావు, మువ్వల సురేష్, పల్లా పెంటారావు, పీతల మహేష్, వర ప్రసాద్, మొల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.


