మురళీనగర్: ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై) ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈనెల 19న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు విశాఖపట్నం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అమర్దీప్ మిశ్రా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారం ఈపీఎఫ్వో కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర్హులైన ఉద్యోగులు, యజమానులకు పీఎంవీబీఆర్వై కింద ప్రోత్సాహక ప్రయోజనాల విడుదల కోసం జాతీయ స్థాయి ప్రత్యేక కార్యక్రమాన్ని ఈనెల 19న విజ్ఞాన్ భవన్లో ప్రధాన మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 200 పారిశ్రామిక క్లస్టర్లు, రాష్ట్ర రాజధానుల్లో సమాంతర కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఇవన్నీ న్యూఢిల్లీలో జరిగే ప్రధాన కార్యక్రమంతో అనుసంధానించబడతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 19న సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో, అలాగే విజయనగరం ఈపీఎఫ్వో కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


