అమావాస్య సమయం సమీపిస్తున్న వేళ విశాఖ సాగరతీరంలో కెరటాల ఉధృతి పెరిగింది. ఆదివారం ఉదయం భారీ అలలు ఎగసిపడి తీరాన్ని బలంగా తాకాయి. కోకో ఎరీనా వద్ద కొబ్బరి చెట్లను దాటి ఫుట్పాత్ వరకు దూసుకొచ్చిన కెరటాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అయితే అలల ఉధృతి కారణంగా తీరంలో ఇసుక కోత ఏర్పడుతోంది. యోగా విలేజ్ ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల వేర్లను కెరటాలు తాకుతూ నేలను కోసేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సముద్ర స్నానాలు, తీరంలో ఆటలు ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
– ఏయూక్యాంపస్


