మహారాణిపేట: రూరల్ మండల పరిధిలోని 160 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ‘వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్’జెక్ట్ పనులను తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్.కృష్ణ, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి కూతవేటు దూరంలో ఉందని, ఇది పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన, జీవ వైవిధ్యం గల ప్రాంతమని వారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇలాంటి ప్రాంతంలో ప్రాజెక్టు నెలకొల్పడానికి రాష్ట్ర అటవీ విభాగం ఎటువంటి అభ్యంతరం లేదంటూ నిరభ్యంతర పత్రం మంజూరు చేయడం పర్యావరణ పరిరక్షణకు, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’అని వి.ఎస్.కృష్ణ తెలిపారు. అక్రమంగా అడవిని నరికివేయడానికి కారకులైన అధికారులు, సంబంధిత సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


